ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఒకే కుటుంబంలో నలుగురు మృతి

  • ముంబైలోని పైధోనిలో విషాధ ఘటన
  • బంధువుల ఇంట్లో విందులో బిర్యానీ తిన్న నలుగురు కుటుంబ సభ్యులు
  • అర్ధరాత్రి ఇంటికి వచ్చి పుచ్చకాయ తిన్న కుటుంబ సభ్యులు
  • ఉదయం వాంతులు, విరేచనాలు కావడంతో ఆసుపత్రికి తరలింపు
  • చికిత్స పొందుతూ మృతి చెందిన భార్యాభర్తలు, ఇద్దరు కూతుళ్లు
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా నలుగురు మృతి చెందారు. బంధువులతో కలిసి బిర్యానీ, పుచ్చకాయ తిన్న ఆ కుటుంబం కొన్ని గంటల్లోనే అస్వస్థతకు గురై మృత్యువాతపడ్డారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా చనిపోయారని ప్రాథమికంగా గుర్తించినప్పటికీ, మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముంబైలోని పైధోనిలో ఈ విషాధ ఘటన జరిగింది.

అబ్దుల్లా ఖాదర్ (40), అతడి భార్య నస్రీన్ (35), ఇద్దరు కుమార్తెలు ఆయేషా (16), జైనాబ్ (13) నలుగురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అబ్దుల్ స్థానికంగా మొబైల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి బంధువులు నిర్వహించిన విందులో అబ్దుల్లా కుటుంబం పాల్గొంది. విందు సందర్భంగా బంధువుల ఇంట్లో బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత ఇంటికి చేరుకుని, అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పుచ్చకాయ తిన్నారు.

ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. అబ్దుల్లా వెంటనే స్థానికంగా ఉన్న వైద్యుడిని పిలిపించాడు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వారిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారు చికిత్స పొందుతూ ఉదయం పది గంటలకు మరణించారు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Mumbai family dead next morning
Mumbai family feasts on biryani
watermelon

More Telugu News